పదవ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి
పదవ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి
- మార్చి 14 నుండి పరీక్షలు – అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
- మాల్ప్రాక్టీస్కు తావులేకుండా చర్యలు
- పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి
జగిత్యాల, ఫిబ్రవరి 21 (పీపుల్స్ మోటివేషన్): వచ్చేనెల మార్చి 14 నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలను పారదర్శకంగా, లోపరహితంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన పర్యవేక్షణలో ఎస్ఎస్సీ విధులు నిర్వహించే సూపరింటెండెంట్లు, విభాగాధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఐడిఓసి సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారులు, కేంద్ర సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, కస్టోడియన్లు, వాహన ఇన్చార్జీలు హాజరయ్యారు. విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన ఈ పరీక్షలు ఎలాంటి లోపాలు లేకుండా జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లో చరవాణులు అనుమతించకూడదని, విధుల్లో ఉన్న ప్రతి అధికారి గుర్తింపు కార్డు ధరించాలన్నారు. తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, సరిపడా బెంచీలు వంటి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ప్రశాంత వాతావరణం కోసం పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశించారు.
ప్రశ్నపత్రాల రవాణా, భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఉండాలని తెలిపారు. మాల్ప్రాక్టీస్కు అవకాశం లేకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు రవాణా, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. జిల్లా పరీక్షల విభాగం డైరెక్టర్ నరేందర్ మాట్లాడుతూ హాల్ టికెట్లు, ఓఎంఆర్ షీట్లు, ప్రశ్నపత్రాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమన్నారు. ఆన్సర్ స్క్రిప్టులను సబ్జెక్టు, మీడియం, కేంద్రాల వారీగా సక్రమంగా ప్యాక్ చేసి పంపించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉత్తమ ర్యాంకింగ్ సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డిఇఓ రాము సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
