చంద్రబాబు వ్యక్తిత్వంపై అసభ్య పోస్టులు
చంద్రబాబు వ్యక్తిత్వంపై అసభ్య పోస్టులు
- సీఐడీకి టీడీపీ ఫిర్యాదు
- ఫేక్ పత్రాలతో విష ప్రచారం ఆరోపణ
- సీఐడీ డీజీకి ఆధారాలతో ఫిర్యాదు
- నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
అమరావతి, ఫిబ్రవరి 27 (పీపుల్స్ మోటివేషన్): ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తదితర నేతలు సీఐడీ డీజీని కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం నకిలీ పత్రాలతో విషప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ సంబంధిత ఆధారాలను సమర్పించారు. తదనంతరం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించినా వైసీపీ తీరు మారలేదని విమర్శించారు. అధికారం కోల్పోయిన నిరాశతో చంద్రబాబుపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి కలిసి నేరపూరిత కుట్రకు తెరలేపారని ఆరోపించారు. ‘ఎఫ్స్టీన్ ఫైల్స్’ తరహాలో తప్పుడు పత్రాలు సృష్టించి చంద్రబాబును హై ప్రొఫైల్ అనుమానితుడిగా చూపే ప్రయత్నం చేశారని తెలిపారు.
‘దామురెడ్డి’ అనే వ్యక్తి ద్వారా విదేశీ క్లాసిఫైడ్ డాక్యుమెంట్ల పేరుతో నకిలీ పత్రాలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని వర్ల రామయ్య పేర్కొన్నారు. ఈ విషయంపై సీఐడీ డీజీకి ఫిర్యాదు చేయగా ఆయన కూడా తీవ్రంగా స్పందించారని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా కులమత విభేదాలను రెచ్చగొట్టే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని ఓర్వలేకే వైసీపీ ఇటువంటి రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న కుట్రలపై సమగ్ర దర్యాప్తు జరిపించి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీఐడీ డీజీ సానుకూలంగా స్పందించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు టీడీపీ నేతలు వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
