మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకాలపై కేటీఆర్ ఆగ్రహం
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకాలపై కేటీఆర్ ఆగ్రహం
- కిడ్నాప్లు, దాడులతో పదవుల కొల్లగొట్టే కుట్ర ఆరోపణ
- డీజీపీ, ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలంటూ డిమాండ్
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (పీపుల్స్ మోటివేషన్): తెలంగాణలోని పలు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన ప్రభుత్వం పోలీసు బలగాలను అడ్డుపెట్టుకొని గూండాల మాదిరిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎక్స్ అఫీషియో ఓట్ల పేరుతో దొంగ ఓట్లను నమోదు చేసుకొని పదవులు పొందాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని విమర్శించారు. తొర్రూరు, జనగామ, క్యాతనపల్లి, కాగజ్నగర్ తదితర పట్టణాల్లో చోటుచేసుకున్న ఘటనలను ప్రస్తావిస్తూ, గెలిచిన ప్రజాప్రతినిధులను కిడ్నాప్ చేసే ప్రయత్నాలు, దాడులు, బెదిరింపులు జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారాయో చూపుతున్నాయని అన్నారు. పలు చోట్ల మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలపై కాంగ్రెస్ అనుచరులు దాడులు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఒత్తిడితో కోరం ఉన్న చోట్ల కూడా ఎన్నికలను వాయిదా వేయడం ఎన్నికల ప్రక్రియను అవమానపరిచే చర్య అని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై రాష్ట్ర డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల సంఘం సమగ్ర విచారణ చేపట్టి, అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సాగిస్తున్న అరాచకాలకు తెలంగాణ ప్రజలే తగిన సమాధానం చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Comments
