అమరావతి క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన..
అమరావతి క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన..
- భారత్ టెక్ భవిష్యత్తుకు చారిత్రక అడుగు
- దేశంలో తొలి క్వాంటమ్ ఎకోసిస్టమ్కు శ్రీకారం
- 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రం ఏర్పాటు
- భారత్ సాంకేతిక నాయకత్వానికి పునాది
అమరావతి, ఫిబ్రవరి 7, (పీపుల్స్ మోటివేషన్): భారత్ సాంకేతిక భవిష్యత్తులో చారిత్రక మైలురాయిగా నిలిచే అమరావతి క్వాంటమ్ వ్యాలీకి శనివారం శంకుస్థాపన జరిగింది. ఉద్దండరాయునిపాలెంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి క్వాంటమ్ వ్యాలీకి పునాది వేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. దేశంలోనే తొలి క్వాంటమ్ ఎకోసిస్టమ్గా అమరావతి క్వాంటమ్ వ్యాలీ రూపుదిద్దుకోనుందని ఈ సందర్భంగా వెల్లడించారు.
ఈ ప్రాజెక్టు కింద అమరావతిలో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు కలిసి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రత, రక్షణ, ఆరోగ్యం, ఆర్థిక రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలకు ఈ కేంద్రం కీలకంగా మారనుందని అధికారులు తెలిపారు.
అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా దేశానికి ప్రపంచ స్థాయిలో సాంకేతిక గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని నాయకులు స్పష్టం చేశారు. ఇది కేవలం రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశానికి భవిష్యత్ టెక్నాలజీ హబ్గా అమరావతిని నిలబెట్టే ప్రాజెక్టుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
