వైసీపీ డ్రామా కంపెనీలా వ్యవహరిస్తోంది: జనసేన ఎమ్మెల్యేల విమర్శ
వైసీపీ డ్రామా కంపెనీలా వ్యవహరిస్తోంది: జనసేన ఎమ్మెల్యేల విమర్శ
- - కల్తీ నెయ్యి అంశంలోనూ నాటకాలు
- - అభివృద్ధి పనులపై ఒక్క మాట కూడా లేదు
- - అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ఓటర్లు నిలదీయాలి
అమరావతి, ఫిబ్రవరి 13 (పీపుల్స్ మోటివేషన్): వైసీపీ ఒక పెద్ద డ్రామా కంపెనీలా వ్యవహరిస్తోందని జనసేన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన వారు, బాబాయ్ హత్య కేసు నుంచి ఇప్పటి కల్తీ నెయ్యి వ్యవహారం వరకు వైసీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.
తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు సీబీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారించినప్పటికీ, వైసీపీ నేతలు రోడ్డెక్కి డ్రామాలు చేస్తున్నారని అన్నారు. ఒకవైపు సుబ్బారెడ్డి కల్తీ జరిగినట్లు ఒప్పుకున్నా, మరోవైపు తప్పును బుకాయించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాధి, పోలవరం నిర్మాణం, రాజధాని అమరావతి పనులపై వైసీపీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు.
పంచాయతీరాజ్ శాఖలో మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా సాగుతోందని, సాస్కీ నిధుల కింద రూ.2123 కోట్లు కేటాయించి రహదారులు అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. జల్ జీవన్ మిషన్కు మళ్లీ ఊపునిచ్చామని, రైతులకు 24 గంటల్లోనే ధాన్యం చెల్లింపులు చేస్తున్నామని వివరించారు. సామాజిక పెన్షన్ను రూ.4 వేలకు పెంచినట్లు, యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రజలు నిలదీయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు గెలిపించింది సమస్యలు పరిష్కరించేందుకు కాదా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన శాసనసభను వదిలి రోడ్లపై రాజకీయాలు చేయడం సరైంది కాదని జనసేన ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.
