మన్రేగా పరిరక్షణే లక్ష్యం
మన్రేగా పరిరక్షణే లక్ష్యం
- సత్యసాయి జిల్లాలో మూడో రోజు పరిరక్షణ యాత్ర
- శ్రామికులతో కలిసి గునపం పట్టిన వైఎస్ షర్మిల
సత్యసాయి, ఫిబ్రవరి 4 (పీపుల్స్ మోటివేషన్):
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పరిరక్షణ యాత్ర మూడో రోజు సత్యసాయి జిల్లాలో కొనసాగింది. ధర్మవరం నియోజకవర్గంలోని రాఘవంపల్లి గ్రామంలో కరువు పనులకు హాజరైన శ్రామికులను కలిసి, చట్టం ద్వారా జరుగుతున్న నష్టాలను కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వివరించారు.
మన్రేగా పథకాన్ని ప్రస్తుత పాలకులు పూర్తిగా బ్రష్టు పట్టించారని షర్మిల ఆరోపించారు. 100 రోజుల ఉపాధి హామీ చట్టం ఉన్నప్పటికీ, సగం రోజులు కూడా పని కల్పించడం లేదని, అర్హత కలిగిన పేదల జాబ్ కార్డులను తొలగించడం దారుణమని శ్రామికులు తమ ఆవేదనను వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం పేదల జీవనాధారమని, దాన్ని నిర్వీర్యం చేయడం అన్యాయమని పేర్కొన్నారు.
మన్రేగా పథకాన్ని కొనసాగించాలనే డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పరిరక్షణ ఉద్యమానికి శ్రామికులు మద్దతు తెలపడం మరింత బలాన్ని ఇస్తోందని వైఎస్ షర్మిల అన్నారు. పేదల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. శ్రామికులకు భరోసా ఇచ్చేలా తాను కూడా గునపం పట్టి మట్టి తవ్వి పనిలో పాల్గొన్నట్లు షర్మిల తెలిపారు. శ్రమకు గౌరవం, పేదలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ ఉద్యమం కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

