ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్కార్ట్.. స్విగ్గీ, జొమాటో షేర్లు లాస్
ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్కార్ట్.. స్విగ్గీ, జొమాటో షేర్లు లాస్
బెంగళూరు – ఫిబ్రవరి 12 – పీపుల్స్ మోటివేషన్
వాల్మార్ట్కు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ (Flipkart) మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ‘మినిట్స్’ పేరుతో క్విక్ కామర్స్ విభాగంలో ప్రవేశించిన ఈ సంస్థ.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలోనూ తన సత్తా చాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ వార్తల ప్రభావంతో ఇప్పటికే ఈ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న స్విగ్గీ, జొమాటో కంపెనీల షేర్లు గురువారం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
‘ఎకనామిక్ టైమ్స్’ కథనం ప్రకారం, ఈ ఏడాది మే-జూన్ మధ్య బెంగళూరులో ప్రయోగాత్మకంగా ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించే ఆలోచనలో ఫ్లిప్కార్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభానికి పూర్తి స్థాయిలో సేవలను విస్తరించాలనే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతున్నట్లు సమాచారం. స్విగ్గీ, జొమాటో తరహాలో స్వంత ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాలా లేదా ప్రభుత్వ ఈ-కామర్స్ వేదిక ఓఎన్డీసీ (ONDC)లో బయ్యర్ సైడ్ అప్లికేషన్గా సేవలు అందించాలా అనే అంశాలపై సంస్థ పరిశీలన జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంపై ఫ్లిప్కార్ట్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.
ప్రస్తుతం దేశీయ ఫుడ్ డెలివరీ మార్కెట్లో స్విగ్గీ, జొమాటో సంస్థల ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ రంగంలోకి గతంలో కొన్ని కంపెనీలు ప్రవేశించేందుకు ప్రయత్నించినప్పటికీ పెద్దగా విజయం సాధించలేకపోయాయి. అయితే వాల్మార్ట్ మద్దతు ఉన్న ఫ్లిప్కార్ట్ రంగప్రవేశం చేస్తుందన్న వార్తలు మార్కెట్లో చర్చనీయాంశంగా మారాయి.
ఈ నేపథ్యంలో జొమాటో మాతృసంస్థ ఎటర్నల్ షేరు విలువ సుమారు 2 శాతం వరకు పడిపోయి రూ.291.40 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అనంతరం కొంత మేర కోలుకుంది. అలాగే స్విగ్గీ షేరు కూడా ఒక దశలో 3 శాతానికి పైగా నష్టపోయి రూ.328 వద్ద ట్రేడ్ అయింది. గతంలో ర్యాపిడో ఫుడ్ డెలివరీ రంగంలోకి వస్తుందన్న వార్తలు వచ్చినప్పుడూ ఇదే తరహాలో షేర్లపై అమ్మకాల ఒత్తిడి కనిపించిన సంగతి తెలిసిందే.
