మద్యం మత్తు డ్రైవింగ్పై కఠిన చర్యలు
మద్యం మత్తు డ్రైవింగ్పై కఠిన చర్యలు
- ఉద్యోగదాతలకు సమాచారం పంపే కొత్త నిర్ణయం
- ‘ఎరైవ్–ఎలైవ్’ కార్యక్రమంతో ప్రమాదాల కట్టడి
- మార్చి ఒకటో తేదీ నుంచి అమలు
విజయవాడ, ఫిబ్రవరి 20 (పీపుల్స్ మోటివేషన్): మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై విజయవాడ నగర ట్రాఫిక్ పోలీసులు కొత్త అస్త్రాన్ని ప్రయోగించనున్నారు. ఇప్పటి వరకు మద్యం మత్తులో వాహనాలు నడిపి పట్టుబడిన వారి మీద కేసులు నమోదు చేసి జరిమానాలు విధించేవారు. అయితే ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్లో చిక్కిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వివరాలను వారి ఉద్యోగ సంస్థలకు కూడా పంపించేలా చర్యలు తీసుకోనున్నారు. రోడ్డు ప్రమాదాల కట్టడే లక్ష్యంగా పోలీసులు ఇటీవల ‘ఎరైవ్ – ఎలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇబ్రహీంపట్నం, జి.కొండూరు పరిధిలో పది నుంచి పదిహేను ప్రాంతాల్లో నిత్యం తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధిక వేగం, మద్యం మత్తే ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్నాయని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉద్యోగాలకే ముప్పు తలెత్తుతుందనే స్పష్టమైన సంకేతాలను పంపాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నగర పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు, ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం ఆదేశాల మేరకు మార్చి ఒకటో తేదీ నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. తనిఖీల్లో చిక్కిన వారి ఉద్యోగ వివరాలను సేకరించి ఆయా సంస్థల అధిపతులకు పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మద్యం ఎంత తాగినా వాహనం సమర్థంగా నడపగలమనే తప్పుడు ధీమా చాలామందిలో ఉందని ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్ తెలిపారు. మద్యం ప్రభావం మెదడుపై తీవ్రంగా పడుతుందనే అవగాహన లేకపోవడమే ప్రమాదాలకు కారణమని అన్నారు. ఉద్యోగ, పరువు ప్రతిష్ఠలపై ప్రభావం ఉంటుందని తెలుసుకుంటే మద్యం మత్తులో వాహనాలు నడపకుండా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం మద్యం మత్తులో వాహనం నడిపి తొలిసారి పట్టుబడితే పది వేల రూపాయల జరిమానా, ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉంది. రెండోసారి పట్టుబడితే పదిహేను వేల రూపాయల జరిమానా, రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ను కూడా నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే తమ లక్ష్యమని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.
