విశాఖ ఉక్కు కర్మాగారానికి మళ్లీ లాభాల బాట
విశాఖ ఉక్కు కర్మాగారానికి మళ్లీ లాభాల బాట
- - జనవరి 2026లో రూ.54 కోట్ల లాభం నమోదు
- - కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పునరుజ్జీవనం
విశాఖపట్నం, ఫిబ్రవరి 4 (పీపుల్స్ మోటివేషన్):
విశాఖ ఉక్కు కర్మాగారం మళ్లీ లాభాల బాట పట్టింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు చెందిన విశాఖ ఉక్కు కర్మాగారం జనవరి 2026లో రూ.54 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న సంస్థకు ఇది కీలక మలుపుగా మారింది.
ఉక్కు ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి నమోదైంది. రోజువారీ హాట్ మెటల్ ఉత్పత్తి 19,401 టన్నులకు చేరింది. గత సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇది కేవలం 9,215 టన్నులుగా మాత్రమే ఉండగా, ప్రస్తుతం ఉత్పత్తి దాదాపు రెట్టింపు కావడం విశేషం. ప్లాంట్ సామర్థ్య వినియోగం కూడా రికార్డు స్థాయిలో 94 శాతానికి చేరగా, గతేడాది ఇది 45 శాతంగా మాత్రమే నమోదైంది.
ఈ పునరుజ్జీవనానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.11,440 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ కీలకంగా మారింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పన్నులు, బకాయిల్లో ఇచ్చిన ఉపశమనంతో సంస్థ ఆర్థిక స్థితి మెరుగుపడింది. ప్రస్తుతం మూడు బ్లాస్ట్ ఫర్నేస్లు పూర్తిస్థాయిలో పనిచేయడం వల్ల ఉత్పత్తి వేగంగా పెరిగింది.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల్లో కొత్త విధానాలు అమలు చేసి, సంస్థ క్రెడిట్ రేటింగ్ను మెరుగుపరచాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారం తిరిగి లాభాల బాటలో నిలబడటం ఆంధ్రప్రదేశ్ పరిశ్రమాభివృద్ధికి శుభపరిణామంగా పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

