శాసనమండలిలో మాటల యుద్ధం
శాసనమండలిలో మాటల యుద్ధం
- సంక్షేమ పథకాలపై అధికార, విపక్షాల మధ్య ఘర్షణ
- ‘అన్నదాత సుఖీభవ’పై బొత్స సవాల్
- ‘తల్లికి వందనం’ నిధులపై మంత్రి ప్రతిసవాల్
- పింఛన్ల అంశంపై ప్రభుత్వ వివరణ
అమరావతి, ఫిబ్రవరి 12 (పీపుల్స్ మోటివేషన్): ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు గురువారం అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలతో దద్దరిల్లాయి. సంక్షేమ పథకాల అమలుపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ముఖ్యంగా వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో సభా వాతావరణం వేడెక్కింది. గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రూ.20,000 ఇచ్చినట్లు చెప్పడం పూర్తిగా అవాస్తవమని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ప్రభుత్వం చెప్పింది నిజమని నిరూపిస్తే తాను బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి సిద్ధమని సవాల్ విసిరారు. అలాగే ‘వసతి దీవెన’ నిధులు విడుదల కాలేదని, ప్రైవేటు ఆసుపత్రులు ‘ఆరోగ్యశ్రీ’ని నిరాకరిస్తున్నాయని, ‘తల్లికి వందనం’ సక్రమంగా అందడం లేదని విమర్శించారు. గత 19 నెలల్లో 60 ఏళ్లు నిండిన వారికి ఎన్ని కొత్త పింఛన్లు ఇచ్చారని కూడా ప్రశ్నించారు.
బొత్స ఆరోపణలకు మంత్రి కొలుసు పార్థసారథి దీటుగా స్పందించారు. ‘తల్లికి వందనం’ నిధులు నియోజకవర్గాలు, జిల్లాల వారీగా పంపిణీ చేసినట్లు పత్రాలతో సహా నిరూపిస్తామని ప్రకటించారు. ఒకవేళ రుజువు చేయలేకపోతే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రతిసవాల్ విసిరారు. ‘అన్నదాత సుఖీభవ’ కింద 48 లక్షల మందికి లబ్ధి చేకూరిందని, ఒక్కరికీ పడలేదనడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. పింఛన్ల అంశంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క పింఛనూ తొలగించలేదని తెలిపారు. మరణాల కారణంగా కొన్ని పింఛన్లు ఆగిపోయాయని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 63.2 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయని వివరించారు. సంక్షేమ పథకాల అమలుపై ఇరుపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో మండలిలో రాజకీయ వేడి కొనసాగుతోంది.
