తిరుమల లడ్డూ వ్యవహారంపై మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు
తిరుమల లడ్డూ వ్యవహారంపై మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు
- వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్
- లడ్డూ కల్తీ ఘటన బాధాకరమని వ్యాఖ్య
- సభను అడ్డుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శ
అమరావతి, మార్చి 4 (పీపుల్స్ మోటివేషన్): తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏడుకొండల వాడి సాక్షిగా చెబుతున్నానని, తిరుమల లడ్డూ కల్తీ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు నివేదికలో ఉన్న విషయాలను మాత్రమే సభ ముందు ఉంచారని తెలిపారు. అయితే చేసిన తప్పు బయటపడుతుందనే భయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కావాలనే ఇతర అంశాలను తెరపైకి తెచ్చి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికు హిందూ ధర్మంపై గౌరవం లేదని తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు అచ్చెన్నాయుడు చెప్పారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు వైసీపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మండలి చైర్మన్ ఇచ్చిన సూచనలను గౌరవించి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నప్పటికీ వైసీపీ నేతలు సభను అడ్డుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ధర్మం కోసం ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
