హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
- క్లోమ క్యాన్సర్పై క్లిష్టమైన లాప్రోస్కోపిక్ సర్జరీ
- కిడ్నీ మార్పిడి పొందిన రోగిపై విజయవంతమైన చికిత్స
- ప్రపంచంలో ఇదే తొలి లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సగా వైద్యుల వెల్లడి
హైదరాబాద్, 10 మార్చి (పీపుల్స్ మోటివేషన్):
దేశంలో మెడికల్ హబ్గా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరంలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతమైంది. కొండాపూర్లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన లాప్రోస్కోపిక్ ప్యాంక్రియాటోడ్యూడెనెక్టమీ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను ఆస్పత్రి కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ వెల్లడించారు.
కిడ్నీ మార్పిడి అనంతరం మూడు రకాల ఇమ్యూనోసప్రెషన్ చికిత్స పొందుతున్న ఒక రోగిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ను గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. లాప్రోస్కోపిక్ విధానంలో ప్యాంక్రియాటోడ్యూడెనెక్టమీ చేయాలని నిర్ణయించినప్పటికీ, రోగికి పాలీసిస్టిక్ లివర్ వ్యాధి, మార్పిడి చేసిన కిడ్నీలో పెద్ద సిస్టు, గతంలో ఓపెన్ బైలాటరల్ నెఫ్రెక్టమీ వంటి సమస్యలు ఉండటంతో శస్త్రచికిత్స మరింత క్లిష్టంగా మారిందని చెప్పారు.
చిన్నపేగు, కాలేయానికి రక్తాన్ని సరఫరా చేసే సుపీరియర్ మెసెంటరిక్ వీన్ ప్రభావితమవడం మరో పెద్ద సవాల్గా మారిందని డాక్టర్ నవీన్ తెలిపారు. లాప్రోస్కోపిక్ విధానంలో విప్పుల్స్ సర్జరీతో పాటు ప్రభావితమైన రక్తనాళాన్ని తొలగించి చికిత్స నిర్వహించామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా చాలా కొద్దిమంది మాత్రమే ఇలాంటి లాప్రోస్కోపిక్ రక్తనాళ శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రధాన ప్యాంక్రియాస్ శస్త్రచికిత్సల్లో మరణాల శాతం 50 వరకు ఉండే ప్రమాదం ఉంటుందని వైద్యులు తెలిపారు. అందువల్ల శస్త్రచికిత్స అనంతర సంరక్షణను కూడా అత్యంత జాగ్రత్తగా నిర్వహించినట్లు చెప్పారు. ప్రపంచంలో లాప్రోస్కోపిక్ విధానంలో నిర్వహించిన తొలి కేసుగా ఇది నిలిచిందని, అమెరికాలోని మేయో క్లినిక్లో మాత్రమే ఇలాంటి శస్త్రచికిత్స ఓపెన్ విధానంలో నిర్వహించారని డాక్టర్ నవీన్ కుమార్ వెల్లడించారు.
