రామగుండం ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
రామగుండం ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
- అవసరమైన పరికరాల ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశాలు
- విభాగాల పరిశీలన – మెరుగైన వైద్య సేవలపై దృష్టి
- గోదావరిఖనిలో బాలికల వసతి గృహాన్ని కూడా తనిఖీ
రామగుండం, మార్చి 26 (పీపుల్స్ మోటివేషన్): రామగుండం జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవల మెరుగుదలకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలు, సౌకర్యాలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్, రోగులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలపై సమగ్ర ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఆసుపత్రి నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని ప్రధానంగా తీసుకోవాలని సూచించారు.
తనిఖీలో భాగంగా అవుట్ పేషెంట్ విభాగాలు, క్రిటికల్ కేర్ సెంటర్, ఎస్ఎన్సీయూ, ఎక్స్రే విభాగం, అల్ట్రాసౌండ్, చిన్న పిల్లల విభాగం, ఫిజియోథెరపీ విభాగాలను కలెక్టర్ సవివరంగా పరిశీలించారు. ప్రతి విభాగంలో రోగులకు అందుతున్న సేవల నాణ్యత, సిబ్బంది పనితీరును సమీక్షించారు. అవసరమైన చోట మెరుగుదల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అదనంగా ఒక ఎక్స్రే యంత్రం, అల్ట్రాసౌండ్ సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కలెక్టర్ గుర్తించారు. ఫిజియోథెరపీ విభాగాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన సిబ్బందిని నియమించాలని కూడా ఆదేశించారు. వైద్య సేవలలో ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణ చికిత్స అందేలా అన్ని ఏర్పాట్లు ఉండాలని సూచించారు. సదరం విభాగంలో చేసిన ఏర్పాట్లపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. న్యూ బ్లాక్లో ఉన్న అవుట్ పేషెంట్ గదులను పరిశీలించి, వైద్యులు సమయానికి విధులకు హాజరై రోగులకు సమర్థవంతమైన సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఆసుపత్రి వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
అనంతరం ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధులతో గోదావరిఖనిలో నిర్మించిన ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ పరిశీలించారు. అక్కడి వసతులు, భద్రతా ఏర్పాట్లు, నిర్వహణ విధానాన్ని సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు. బాలికలకు అనుకూల వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో వైద్య అధికారులు డాక్టర్ అరుణ, డాక్టర్ కృపాభాయ్, డాక్టర్ రాజు, నర్సింగ్ పర్యవేక్షకులు మరదలినతో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆసుపత్రి సేవలను మరింత మెరుగుపరచేందుకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
