టీటీడీ నిర్ణయాలపై భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
టీటీడీ నిర్ణయాలపై భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు
- అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణంపై ప్రశ్నలు
- భూమి కొనుగోలుపై ప్రభుత్వాన్ని నిలదీత
- టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్
తిరుపతి, 9 మార్చి (పీపుల్స్ మోటివేషన్): ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు టీటీడీ ప్రస్తుత పాలకమండలిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిలోని వెంకటాయపాలెంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి టీటీడీ తీసుకున్న నిర్ణయాలను ఆయన తప్పుబట్టారు. ఈ నిర్ణయాల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. సాధారణంగా దేవాలయాల నిర్మాణానికి భక్తులు లేదా సంస్థలు ఉచితంగా భూములు ఇస్తారని భూమన తెలిపారు. అయితే అమరావతిలో శ్రీవారి ఆలయం నిర్మాణం కోసం టీటీడీ రూ.12.5 కోట్లు వెచ్చించి భూమిని కొనుగోలు చేయడం ఏంటని ప్రశ్నించారు. టీటీడీ చరిత్రలో ఇప్పటివరకు ఆలయాల కోసం భూమిని కొనుగోలు చేసిన దాఖలాలు లేవని, ఇది భక్తుల సొమ్మును దుర్వినియోగం చేయడమేనని ఆయన మండిపడ్డారు.
ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం ఉచితంగా భూములు కేటాయిస్తోందని, కానీ దేవాలయానికి మాత్రం భూమిని అమ్మడం అన్యాయమని ఆయన విమర్శించారు. టీటీడీ చెల్లించిన రూ.12.5 కోట్లను సీఆర్డీఏ వెంటనే తిరిగి ఇవ్వాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై వస్తున్న వ్యక్తిగత ఆరోపణలపై కూడా ఆయన స్పందించారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగడం సరికాదని పేర్కొన్నారు. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల తిరుమలలో నెయ్యి ట్యాంకర్ బోల్తా పడటం వంటి ఘటనలు చోటుచేసుకోవడం కూడా ఆందోళనకరమని, తిరుమల పవిత్రతను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.
Comments
