సూర్యాపేట మున్సిపల్ బడ్జెట్ సమావేశం.. అభివృద్ధిపై దృష్టి
సూర్యాపేట మున్సిపల్ బడ్జెట్ సమావేశం.. అభివృద్ధిపై దృష్టి
- ప్రణాళికాబద్ధంగా బడ్జెట్ అమలు చేయాలని సూచనలు
- పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక ఫోకస్
- ప్రజా భాగస్వామ్యంతో పట్టణ అభివృద్ధికి పిలుపు
సూర్యాపేట, మార్చి 31 (పీపుల్స్ మోటివేషన్): సూర్యాపేట మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులు, ప్రజా ప్రతినిధులకు కీలక సూచనలు చేశారు. పట్టణ అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బడ్జెట్ రూపొందించి సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పేర్కొన్నారు. మున్సిపల్ సిబ్బంది నిరంతరం శ్రమించి పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలని అన్నారు. పరిశుభ్రమైన వాతావరణం ప్రజల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, డ్రైనేజీల శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కింద చేపడుతున్న 99 రోజుల కార్యక్రమాన్ని మున్సిపాలిటీల్లో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణాల్లో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులు వార్డుల్లో పర్యటించి కాలనీల్లోని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని సూచించారు. సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజలతో నేరుగా మమేకం కావడం ద్వారా పరిపాలన మరింత సమర్థవంతంగా మారుతుందని అన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దే బాధ్యత అందరిదని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
