పెట్టుబడులను ఆకర్షించండి
పెట్టుబడులను ఆకర్షించండి
- పెట్టుబడుల కోసం కలెక్టర్లకూ బాధ్యత: సీఎం చంద్రబాబు
- పెట్టుబడుల ఆకర్షణకు ‘మూడు సీ’ ఫార్ములా
- కలెక్టర్ల పనితీరుకు ర్యాంకులు ప్రకటింపు
- విశాఖ, అమరావతి, తిరుపతి ప్రత్యేక ఆర్థిక ప్రాంతాలు
అమరావతి, మార్చి 12 (పీపుల్స్ మోటివేషన్): రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం కేవలం పరిశ్రమల శాఖ బాధ్యత మాత్రమే కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇకపై జిల్లా కలెక్టర్లు కూడా పెట్టుబడుల సాధనలో పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. పెట్టుబడిదారులను గుర్తించడం, వారిని ఒప్పించడం, వారికి అవసరమైన సహకారం అందించడం కోసం ‘కమిట్మెంట్, కన్విన్స్, కోఆపరేట్’ అనే మూడు సీ ఫార్ములాను అమలు చేయాలని ఆయన తెలిపారు. పెట్టుబడుల విషయంలో జిల్లా కలెక్టర్ల పనితీరును అంచనా వేసి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ఆధారంగా ర్యాంకులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అమరావతిలో జరిగిన ఆరవ జిల్లా కలెక్టర్ల సమావేశంలో రెండో రోజు పెట్టుబడులు, పర్యాటక రంగాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగితేనే స్థానికంగా ఉపాధి అవకాశాలు విస్తరించి ప్రజల తలసరి ఆదాయం పెరుగుతుందని చెప్పారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు త్వరగా కార్యరూపం దాల్చేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ప్రత్యేక ఆర్థిక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక అధికారులను నియమించి బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులకు అనుమతులు, భూ కేటాయింపులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పారిశ్రామికాభివృద్ధికి అనుకూల వాతావరణాన్ని సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. ఓర్వకల్లు, కొప్పర్తి వంటి ప్రాంతాలను ప్రధాన పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. పరిశ్రమలు స్థాపించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ పెట్టుబడిదారులకు అనుకూల విధానాలను అమలు చేస్తున్నామని వివరించారు. ఇక గత ప్రభుత్వ కాలంలో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదని చంద్రబాబు విమర్శించారు. అమర్ రాజా వంటి సంస్థలను కూడా వేధింపులకు గురిచేసి రాష్ట్రం నుంచి వెళ్లేలా చేశారని ఆరోపించారు. గతంలో హైదరాబాద్ను నివసించడానికి అనువైన నగరంగా, పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దినట్లు గుర్తు చేశారు. అదే విధంగా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడులకు అనుకూలమైన ఎకోసిస్టమ్ను నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు.
