బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ముగింపు
బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ముగింపు
- సుప్రీంకోర్టులో కేసు డిస్పోజ్
- స్పీకర్ ఆదేశాలు రెండు రోజుల్లో ప్రచురించాలని ఆదేశం
- పది మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్
న్యూఢిల్లీ, మార్చి 12 (పీపుల్స్ మోటివేషన్) : తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సుప్రీంకోర్టులో ముగింపు పలికింది. గురువారం ఈ కేసును సుప్రీంకోర్టు డిస్పోజ్ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా స్పీకర్ చర్యలు తీసుకోవాలని గతంలో కోర్టు సూచించినప్పటికీ నిర్ణయం ఆలస్యం అవుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం చివరకు కేసును ముగించినట్లు ప్రకటించింది. ఈ కేసును జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ల ధర్మాసనం విచారించింది. స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ ఇప్పటికే పరిశీలించి తగిన నిర్ణయం తీసుకున్నారని ఆయన కోర్టుకు వివరించారు. దీంతో ఈ వ్యవహారం సభాపతి కార్యాలయంలోనే ముగిసిందని తెలిపారు.
స్పీకర్ తరఫు వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ఇకపై ఈ కేసుపై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని భావించింది. ఇప్పటికే స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్నందున కేసును డిస్పోజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే స్పీకర్ జారీ చేసిన ఆదేశాలను రెండు రోజుల్లో అధికారికంగా ప్రచురించాలని కోర్టు ఆదేశించింది. అదే విధంగా పిటిషనర్లకు అవసరమైన సంబంధిత పత్రాలను నాలుగు రోజుల్లో అందజేయాలని కూడా న్యాయస్థానం సూచించింది. దీంతో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న పది మంది ఎమ్మెల్యేలకు సభాపతి క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్నారు.

