ఈస్ట్–వెస్ట్ కార్గో కారిడార్గా రాష్ట్ర అభివృద్ధి
ఈస్ట్–వెస్ట్ కార్గో కారిడార్గా రాష్ట్ర అభివృద్ధి
- పోర్టుల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష
- మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల్లో త్వరితగతిన ఆపరేషన్లు
- కార్గో రవాణా విస్తరణకు కీలక ఆదేశాలు
అమరావతి, 16 మార్చి (పీపుల్స్ మోటివేషన్):
రాష్ట్రాన్ని ఈస్ట్–వెస్ట్ కార్గో కారిడార్గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. పోర్టులు మరియు ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధిపై సోమవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన పోర్టుల అభివృద్ధి, కార్గో రవాణా విస్తరణ, మౌలిక సదుపాయాల బలోపేతంపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో పోర్టుల పాత్ర కీలకమని పేర్కొంటూ వాటి సామర్థ్యాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల్లో త్వరితగతిన కార్గో హ్యాండ్లింగ్ కార్యకలాపాలు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ మూడు పోర్టులను సమర్థవంతంగా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని తూర్పు–పడమర కార్గో రవాణాకు ప్రధాన కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపారు. పోర్టుల ద్వారా సరుకు రవాణా పెరిగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతం లభిస్తుందని సీఎం పేర్కొన్నారు.
ఈ పోర్టుల నుంచి ఒడిశా, ఛత్తీస్ఘఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల హింటర్ల్యాండ్ ప్రాంతాలకు కార్గో రవాణా జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సరుకు రవాణా కోసం రహదారి, రైల్వే మార్గాలను సమన్వయంతో అభివృద్ధి చేసి పారిశ్రామిక రంగానికి అనుకూల వాతావరణం కల్పించాలని చెప్పారు. ఈ చర్యలతో రాష్ట్రం జాతీయ స్థాయిలో ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు.
రామాయపట్నం పోర్టు నుంచి కడప ఉక్కు కర్మాగారం వరకు ప్రత్యేక రవాణా మార్గాన్ని ఏర్పాటు చేయడానికి రైల్వే శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపిందని సీఎం వెల్లడించారు. ఈ ప్రత్యేక మార్గం ఏర్పాటుతో పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు మరియు తయారైన ఉత్పత్తుల రవాణా మరింత సులభం అవుతుందని తెలిపారు. దీని ద్వారా పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. రెండో దశలో బుడిగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి పనులను కూడా వేగంగా చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. తీరప్రాంతాల్లో మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడేలా ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, మారిటైమ్ బోర్డు సీఈఓ అభిషేక్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
