మాది ఐస్-ఫైర్ జోడీ కాదు.. అగ్నికి అగ్ని తోడైనట్టే ఆడుతాం: సంజూ శాంసన్
మాది ఐస్-ఫైర్ జోడీ కాదు.. అగ్నికి అగ్ని తోడైనట్టే ఆడుతాం: సంజూ శాంసన్
న్యూఢిల్లీ, మార్చి 15 (పీపుల్స్ మోటివేషన్):
పొట్టి ప్రపంచకప్లో భారత జట్టు విజయంలో ఓపెనర్ సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తూ జట్టుకు దూకుడు అందించాడు. తమ ఇద్దరి జోడీపై మాట్లాడిన సంజూ శాంసన్, తమది ఐస్-ఫైర్ జోడీ కాదని, ఇద్దరూ అగ్నికి అగ్ని తోడైనట్టే ఆడతామని పేర్కొన్నాడు.
పోటీలో లీగ్ దశలో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన సంజూ, సూపర్ దశలో జట్టులోకి వచ్చి వరుసగా అర్ధశతకాలతో మెరిశాడు. తన ఓపెనింగ్ భాగస్వామి అభిషేక్ శర్మ గురించి మాట్లాడుతూ, “మేమిద్దరం దూకుడుగా ఆడే ఆటగాళ్లమే. కొన్నిసార్లు అభిషేక్ దూకుడుగా ఆడతాడు, మరికొన్నిసార్లు నేను అదే తరహాలో ఆడుతాను. అందుకే మా జోడీని ఫైర్ జోడీ అని చెప్పొచ్చు” అని తెలిపాడు.
మైదానంలో ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉందని కూడా సంజూ చెప్పాడు. “మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. మైదానంలో ఎలా ఆడాలో మేము సహజంగానే మాట్లాడుకుంటాం. బంతి ఎలా వస్తుందో అభిషేక్ అడిగితే, సాధారణంగానే ఉందని చెప్పి దూకుడుగా ఆడమని ప్రోత్సహిస్తాను. అతడు చాలా ధైర్యవంతుడు, అన్ని రకాల షాట్లు ఆడగల సమర్థుడు” అని సంజూ వివరించాడు.
టోర్నీలో సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన చేశాడు. వెస్టిండీస్పై జరిగిన మ్యాచ్లో 97 పరుగులతో జట్టును విజయపథంలో నడిపించాడు. సెమీఫైనల్లో ఇంగ్లండ్పై 89 పరుగులు చేసి జట్టుకు కీలక స్కోరు అందించాడు. ఫైనల్లోనూ అభిషేక్ శర్మతో కలిసి తొలి వికెట్కు 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు భారీ స్కోరు సాధించడంలో సహకరించాడు.
తర్వాత భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో ప్రత్యర్థి జట్టు 159 పరుగులకే కుప్పకూలింది. దీంతో 96 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత జట్టు మరోసారి పొట్టి ప్రపంచకప్ను కైవసం చేసుకుంది.
