జనసేన శాసనసభాపక్ష సమావేశం
జనసేన శాసనసభాపక్ష సమావేశం
- వ్యూహాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం
- 21 ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం
- మంత్రుల శాఖల అభివృద్ధిపై సమీక్ష
- స్థానిక ఎన్నికల్లో 100% విజయ లక్ష్యం
అమరావతి, మార్చి 24 (పీపుల్స్ మోటివేషన్): జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన విజయవాడలో జనసేన శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలు హాజరయ్యారు. రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతంపై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. సమావేశంలో జనసేన మంత్రుల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల పనితీరు, అలాగే పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ శాఖల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో మరింత విస్తరించాలని ప్రజాప్రతినిధులకు ఆదేశించారు.
ప్రజల ప్రాథమిక అవసరాలైన రహదారులు, డ్రైనేజీ, నీటి సదుపాయం, గృహ నిర్మాణం, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఈ సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా ఎమ్మెల్యేలు నిరంతరం పనిచేయాలని సూచించారు. ప్రజలకు చేరువగా ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించడం ముఖ్యం అని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ 100 శాతం విజయాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి, కూటమి స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ విజయానికి కృషి చేయాలని స్పష్టం చేశారు.
పార్టీ క్రమశిక్షణ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ కఠినంగా స్పందించారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను అసలు సహించబోమని హెచ్చరించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ సూచనల మేరకు నెల్లిమర్ల నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తానని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు.
