వృద్ధుల సంక్షేమానికి చట్టబద్ధ రక్షణ
వృద్ధుల సంక్షేమానికి చట్టబద్ధ రక్షణ
- కొత్త బిల్లు అమలుకు ముందడుగు
- ఉద్యోగుల తల్లిదండ్రుల సంరక్షణపై కీలక నిబంధనలు
- జిల్లా స్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు
- వృద్ధులకు గౌరవప్రదమైన జీవనానికి ప్రభుత్వం కట్టుబాటు
జగిత్యాల, ఏప్రిల్ 1 (పీపుల్స్ మోటివేషన్): రాష్ట్రంలో వయోవృద్ధుల సంక్షేమం, భద్రత మరియు గౌరవప్రదమైన జీవనాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన “తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పరిరక్షణ మరియు పర్యవేక్షణ బిల్లు–2026”పై జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, వయోవృద్ధుల శాఖ డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి తన తల్లిదండ్రుల సంరక్షణను బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రుల ఆర్థిక, వైద్య అవసరాలను తీర్చేందుకు ఉద్యోగులు తమ వేతనం నుండి కనీసం 15 శాతం లేదా రూ.10,000 (ఏది ఎక్కువైతే అది) మొత్తాన్ని కేటాయించి నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ బిల్లు అమలును సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ప్రతి శాఖలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కమిటీలలో భాగస్వాములై పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. తల్లిదండ్రుల సంరక్షణలో నిర్లక్ష్యం చూపిన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించినట్లు వెల్లడించారు. ఫిర్యాదులను స్వీకరించి 60 రోజులలోపు పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా అప్పీల్ వ్యవస్థను ఏర్పాటు చేసి కమిటీలకు అర్థన్యాయ అధికారాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. బయోలాజికల్, దత్తత తల్లిదండ్రులు, వృద్ధాప్యంతో ఆధారపడే తల్లిదండ్రులు ఈ బిల్లులో అర్హులుగా ఉంటారని తెలిపారు.
ఈ చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్ 41, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125, సీనియర్ సిటిజన్స్ చట్టం–2007 ఆధారంగా రూపొందించబడిందని మంత్రి వివరించారు. వృద్ధుల సంక్షేమాన్ని బలోపేతం చేసి కుటుంబ బాధ్యతలను చట్టబద్ధం చేయడం ఈ బిల్లులో ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు.
జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ బిల్లు సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. ఆధునిక జీవనశైలిలో తగ్గుతున్న కుటుంబ బంధాలను బలోపేతం చేయడంలో ఈ చట్టం కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ బిల్లును ప్రవేశపెట్టడం గొప్ప నిర్ణయమని అభినందించారు. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ, ఈ బిల్లును సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందన్నారు. ప్రతి శాఖలో పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసి, ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిర్లక్ష్యం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సీనియర్ సిటిజన్స్ యూనియన్ సభ్యులు తమ సమస్యలను, అభిప్రాయాలను ఈ సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ పత్రిక “పిలుపు” గోడపత్రికను ఆవిష్కరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు వృద్ధులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు బి. ఎస్. లత, బి. రాజ గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దినేష్, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ వాణి, ఆర్డీవో మధుసూదన్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మరింత విస్తరించాలని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
