భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
- - సమీకృత భూభారతి పోర్టల్ ప్రారంభం
- - రేపటి నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మక అమలు
- - ఇంటినుంచే భూ సేవలు – రైతులకు సులభతరం
- - పారదర్శక వ్యవస్థతో వివాదాలకు ముగింపు దిశగా అడుగు
- - మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 1 (పీపుల్స్ మోటివేషన్): రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సమీకృత భూభారతి పోర్టల్ను ప్రవేశపెడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రెవెన్యూ శాఖలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. భూమి, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ ఈ పోర్టల్ను రూపొందించినట్లు వెల్లడించారు. ఈ పోర్టల్ను ఏప్రిల్ 2 నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్గల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, నారాయణపేట జిల్లా కొస్గి మండలాల్లో మొదటిగా ఈ వ్యవస్థ అమల్లోకి రానుంది. ఈ ప్రయోగ ఫలితాలను బట్టి అవసరమైన మార్పులు చేసి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ పోర్టల్ ద్వారా రైతులు మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే భూ సేవలను పొందగలుగుతారు. రైతు లాగిన్ అయిన వెంటనే తన భూమికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి. సర్వే అవసరం ఉంటే దానికి సంబంధించిన ఫీజు వివరాలు కూడా స్పష్టంగా తెలుస్తాయి. ఫీజు చెల్లించిన వెంటనే దరఖాస్తు సంబంధిత సర్వేయర్కు చేరుతుంది. తర్వాత రెండు రోజులలో పొరుగు భూమి యజమానులకు నోటీసులు జారీ చేసి, ఏడు రోజుల్లోపు సర్వే తేదీని నిర్ణయిస్తారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోవర్ పరికరాల ద్వారా సర్వే పూర్తి చేసి వివరాలను వ్యవస్థలో నమోదు చేస్తారు. అనంతరం మండల సర్వేయర్ పరిశీలన, తహసీల్దార్ ఆమోదం తర్వాత రైతుకు ఎల్పీఎం, భూధార్ నంబర్లు కేటాయిస్తారు. సర్వే పూర్తయ్యాక మ్యాప్ను రూపొందించి పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ప్రతి దశలో రైతుల మొబైల్ నంబర్కు సమాచార సందేశాలు పంపుతూ పారదర్శకతను నిర్ధారిస్తారు. భూమి కొనుగోలు, అమ్మకాల సమయంలో సర్వే మ్యాప్ను తప్పనిసరి చేయడం ద్వారా భవిష్యత్తులో వివాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
పాత విధానాల్లో ఉన్న గొలుసులు, కొలత కర్రలు వంటి పరికరాలకు బదులుగా ఆధునిక రోవర్ పరికరాలను ఉపయోగించడం వల్ల సర్వే ప్రక్రియ వేగవంతం అవుతుందని అధికారులు తెలిపారు. కచ్చితత్వం పెరగడంతో రైతులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
భూ సమస్యలు రైతుల జీవితాల్లో పెద్ద అడ్డంకిగా మారిన నేపథ్యంలో ఈ పోర్టల్ కీలక మార్పుకు నాంది పలుకుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. రైతు ఇంటి నుంచే అన్ని సేవలు పొందేలా పారదర్శక వ్యవస్థను తీసుకువస్తూ రెవెన్యూ వ్యవస్థలో చారిత్రాత్మక మార్పుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని ఆయన స్పష్టం చేశారు.

